ఇప్పటికే టెలికాం కంపెనీల గుండెల్లో గుబేలు పుట్టిస్తూ సంచలనమైన ఆఫర్లను తీసుకొచ్చిన రిలయన్స్ జియో, మరో కొత్త ఆఫర్ తో మనముందుకు రాబోతుంది. 4జీ సామర్థ్యంతో ఫీచర్ ఫోన్లను లాంచ్ చేయాలని ప్లాన్స్ వేస్తోంది. మార్కెట్లోకి తీసుకురాబోతున్న ఈ కొత్త తరం పోన్లు ధర కూడా చాలా చౌకగా రూ.1000గా ఉండనుందని తెలుస్తోంది. ఈపోన్లులో అపరిమితమైన వాయిస్ , వీడియో కాలింగ్, డిజిటల్ కంటెంట్ ఉంటాయని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ముఖేష్ అంబానీకి చెందినీ ఈ కంపెనీ, ఎల్టీఈ, వాయిస్ ఓవర్ ఎల్టీఈ టెక్నాలజీతో ఫీచర్లు ఫోన్లను తీసుకొస్తుందని, ఈ ఫోన్లు ఎక్కువగా కాల్స్ కోసం వాడే రూరల్, టైర్-2 మార్కెట్ల కస్టమర్లను ఆకట్టుకుంటాయని పేర్కొంటున్నాయి.
దేశంలోని అన్ని రంగాల ప్రజలను తమ సొంతంచేసుకోవడమే జియో ఉద్దేశ్యమని, ఇప్పటికీ భారత్ లో 2జీ ఫీచర్ ఫోన్లకు అతిపెద్ద మార్కెట్ ఉంది. 1 బిలియన్ మొబైల్ ఫోన్ సబ్ స్క్రైబర్లు కంటే ఎక్కువగా ఈ ఫీచర్ ఫోన్లనే వాడతున్నారు. కేవలం జియో మాత్రమే వాయిస్ ఓవర్ ఎల్టీఈ టెక్నాలజీని కాల్స్ చేసుకోవడానికి ఆఫర్ చేస్తోంది. ప్రస్తుతం ఈ టెక్నాలజీ కూడా కేవలం స్మార్ట్ ఫోన్లకు మాత్రమే అందుబాటులో ఉంది.
కానీ రిలయన్స్ జియో తీసుకొచ్చే ఫీచర్ ఫోన్లోనూ ఇక ఈ టెక్నాలజీ అందుబాటులోకి రానుంది. రూ.1000, రూ.1500 ధరల్లో రెండు ఫీచర్ ఫోన్లను రిలయన్స్ అభివృద్ధి చేస్తుందని వాటిని, జనవరి-మార్చిలో లాంచ్ చేసే అవకాశాలున్నాయని మరో అధికారి చెప్పారు. స్మార్ట్ ఫోన్ల మాదిరిగానే ఈ డివైజ్ లు పనిచేయనున్నాయని, కేవలం టచ్ స్క్రీన్ మాత్రమే దీనిలో మిస్ అవుతామని పేర్కొన్నారు. ఒకవేళ జియో వాయిస్ ఓవర్ ఎల్టీఈ టెక్నాలజీతో ఫీచర్ ఫోన్లను తీసుకొస్తే, మార్కెట్లో ఇతర టెలికాం కంపెనీలన్నీ షేక్ అవుతాయని విశ్లేషకులంటున్నారు.
Wednesday 16 November 2016
జియో మరో సంచలన ఆఫర్! ఇతర టెలికాం కంపెనీలన్నీ షేక్?
Thursday 3 November 2016
రైల్వే వర్క్షాపుల్లో 2326 మందికి అప్రెంటీస్షిప్ -ఐటఐ కోర్సులు పూర్తిచేసినవాళ్లు అర్హులు
భారతీయ రైల్వేకు చెందిన వివిధ వర్క్షాపులు, యూనిట్లలో 2326 మందికి అప్రెంటీస్ షిప్ అవకాశం కల్పించడానికి రైల్వే రిక్రూట్మెంట్ సెల్ (సెంట్రల్ రైల్వే) ప్రకటన విడుదలచేసింది. వివిధ ట్రేడ్లలో ఐటీఐ పూర్తిచేసిన అభ్యర్థులు వీటికోసం దరఖాస్తు చేసుకోవచ్చు. పదోతరగతి, ఐటీఐ మార్కుల ద్వారా ఎంపికలు చేపడతారు. అయితే ఇది కేవలం శిక్షణ మాత్రమే. శిక్షణానంతరం రైల్వేలో ఉద్యోగం లభించదు. ఆసక్తి ఉన్నవాళ్లు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం:
అభ్యర్థులు పదోతరగతిలో కనీసం 50 శాతం మార్కులు సాధించాలి. ఐటీఐలో సంబంధిత ట్రేడ్లో సాధించిన మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు. పదోతరగతి, ఐటీఐ రెండింటి మార్కుల ద్వారా మెరిట్ లిస్టు తయారు చేస్తారు. ఈ దశలో అర్హత సాధించినవారి సర్టిఫికెట్లను పరిశీలించి అనంతరం వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఈ రెండింటిలోనూ విజయవంతమైనవారిని అప్రెంటిస్షిప్ కోసం రైల్వే వర్క్షాప్ లేదా యూనిట్కు పంపుతారు. అభ్యర్థులు ముంబై, భుసావల్, పుణే, నాగపూర్, షోలాపూర్ క్లస్టర్లలో ఏదో ఒకదాన్ని ఎంచుకోవాలి. ప్రతి క్లస్టర్లోనూ కొన్ని యూనిట్లు ఉంటాయి. అభ్యర్థి ట్రేడ్ ప్రకారం సంబంధిత యూనిట్కు పంపుతారు. అందువల్ల అభ్యర్థులు ఐటీఐలో చదువుకున్న ట్రేడ్కు సంబంధించిన ఖాళీలు ఉన్న ప్రాంతాన్నే ఎంచుకోవాల్సి ఉంటుంది. ఎంపికైనవారికి ఆయా ట్రేడ్ బట్టి ఏడాది లేదా రెండేళ్ల శిక్షణ కొనసాగుతుంది. డీజిల్ మెకానిక్, కార్పెంటర్, షీట్ మెటల్ వర్కర్ ఇవన్నీ రెండేళ్ల అప్రెంటీస్ షిప్ కోర్సులు. ఎలక్ట్రీషియన్, పెయింటర్, ఫిట్టర్, మ్యాషినిస్ట్, వెల్డర్, మోటార్ వెహికల్ మెకానిక్...ఇవన్నీ ఏడాది కోర్సులు.
ఎంపికైతే:
ఎంపికైన అభ్యర్థుల ట్రేడ్ను బట్టి ఏడాది లేదా రెండేళ్లు అప్రెంటిస్షిప్ కొనసాగుతుంది. ఈ వ్యవధిలో స్టైపెండ్ కూడా చెల్లిస్తారు. ఎంత చెల్లిస్తారో ప్రకటనలో ప్రస్తావించలేదు. అలాగే వసతి సౌకర్యం కల్పించరు. అప్రెంటిస్ వ్యవధి పూర్తయిన తర్వాత రైల్వేలో నేరుగా ఉద్యోగం లభించదు. రైల్వే ఉద్యోగానికి, ఈ అప్రెంటిస్షిప్కు ఎలాంటి సంబంధమూ లేదు. అయితే సంబంధిత ట్రేడ్లో నైపుణ్యాలు మెరుగుపర్చుకోవాలని ఆశించే విద్యార్థులు ఈ అప్రెంటిస్షిప్ తో ప్రయోజనం పొందగలరు. భవిష్యత్తులో ఈ ట్రేడ్లకు సంబంధించి రైల్వే లేదా ఇతర సంస్థల్లో (డాక్యార్డులు, విద్యుత్ సంస్థలు, కార్ల తయారీ యూనిట్లు, బహుళజాతి సంస్థలు...ఇలా పలుచోట్ల) అవకాశాలు లభిస్తాయి. ఈ అప్రెంటిస్షిప్ ద్వారా విలువైన పని అనుభవం సొంతమవుతుంది. ఎలక్ట్రీషియన్, మోటార్ వెహికల్ మెకానిక్..తదితర ట్రేడ్ల్లో శిక్షణ పొందినవాళ్లు స్వయం ఉపాధి దిశగా అడుగులేయొచ్చు.
సందేహాలకు సంప్రదించాల్సిన హెల్ప్లైన్ నంబర్లు: 9768010219 & 9768010681 (ఆదివారాలు, జాతీయ సెలవుదినాలు తప్పించి మిగిలిన అన్ని రోజుల్లోనూ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటలలోపు ఈ నంబర్లలో సంప్రదించవచ్చు)
ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభ తేదీ: నవంబరు 1, ఉదయం 11 గంటల నుంచి
ఆన్లైన్ దరఖాస్తుల ముగింపు తేదీ: నవంబరు 30 సాయంత్రం 5 గంటలు
పరీక్ష ఫీజు: రూ. వంద
వెబ్సైట్:www.rrccr.com/Modules/Home/Home.aspx
అర్హత: పదోతరగతి+ సంబంధిత ట్రేడ్లో ఐటీఐ ఉత్తీర్ణత
వయోపరిమితి: నవంబరు 1, 2016 నాటికి కనీసం 15 ఏళ్లు నిండాలి అలాగే 24 ఏళ్లకు మించరాదు. ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు: ఓబీసీలకు మూడేళ్లు గరిష్ఠ వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
Posted 29-10-2016
Subscribe to:
Posts (Atom)