ప్రముఖ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ సామ్సంగ్..దేశీయ మార్కెట్లోకి చౌక ధర కలిగిన 4జీ మోడల్ను విడుదల చేసింది. జెడ్2 పేరుతో ప్రవేశపెట్టిన ఈ స్మార్ట్ఫోన్ ధరను రూ.4,500గా నిర్ణయించింది. తొలిసారిగా స్మార్ట్ఫోన్ను కొనుగోలు చేయాలనుకునేవారిని లక్ష్యంగా చేసుకొని రూపొందించిన ఈ మొబైల్ను టైజెన్ ఆపరేటింగ్ సిస్టమ్తో తయారుచేసినట్లు కంపెనీ వెల్లడించింది. ఇప్పటికీ 55 కోట్ల మంది భారతీయులు ఫీచర్ ఫోన్లను వాడుతుండగా, ప్రతినెల కోటికిపైగా ఫీచర్ ఫోన్లు అమ్ముడవుతున్నప్పటికీ జెడ్2తో స్మార్ట్ఫోన్ల పరిధి మరింత పెరిగే అవకాశం ఉందని సామ్సంగ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్(మొబైల్ బిజినెస్) మను శర్మ తెలిపారు.
ఇప్పటి వరకు కంపెనీ నుంచి విడుదలైన 4జీ స్మార్ట్ఫోన్లలో ఇదే చౌకధరదని ఆయన వెల్లడించారు. మంగళవారం విడుదల చేసినప్పటికీ ఈ నెల 29 నుంచి ఆఫ్లైన్, ఆన్లైన్ సేవల సంస్థ పేటీఎంలో కూడా లభ్యమవనున్నదన్నారు. నాలుగు అంగుళాల టచ్స్క్రీన్ కలిగిన ఈ స్మార్ట్ఫోన్లో 1.5 గిగాహెడ్జ్ క్వాడ్కోర్ ప్రాసెసర్, 1జీబీ ర్యామ్, 8జీబీ ఇంటర్నల్ మెమొరీ(128 జీబీ వరకు పెంచుకోవచ్చును), 5 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, ముందుభాగంలో 0.3 మెగాపిక్సెల్ కెమెరా, 1,500 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్స్ ఉన్నాయి.
ముకేశ్ అంబానీకి చెందిన టెలికం సేవల సంస్థ రిలయన్స్ జియోతో సామ్సంగ్ కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఈ స్మార్ట్ఫోన్ను కొనుగోలుచేసిన వారికి మూడు నెలలపాటు ఉచితంగా కాల్, మొబైల్ డేటా లభించనున్నది.
No comments:
Post a Comment